• All e-books and audiobooks on The New Life Mission website are free
  • Explore multilingual sermons in global languages
  • Two new revised editions in English have been released
  • Check out our website translated into 27 languages
Search

Sermons

అంశం 3: నీరు మరియు ఆత్మా యొక్క సువార్త

[3-8] యేసు బాప్తిస్మము విమోచనాక్రమంలో తప్పనిసరిగా అనివార్యమైన ప్రక్రియ (మత్తయి 3:13-17)

(మత్తయి 3:13-17)
“ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతనియొద్దకు వచ్చెను.అందుకు యోహాను ‘నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా?’ అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు-ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.’’
 

బాప్తీస్మం మిచ్చు యోహాను ఇచ్చుబాప్తీస్మం 
 
మారుమనస్సు అనగా నేమి?
పాప జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధపరచబడు నిమిత్తము యేసునందు విశ్వాసముంచుట.
 
ప్రభువైన యేసు ఈ లోకమునకు ఎందు నిమిత్తము రావలసి వచ్చెనో అటులనే ఎందుకొరకు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందెనో అనేకులకు తెలియదు.కనుకనే యేసుపొందిన బాప్తిస్మములో ఉన్న ఉద్దేశ్యము అటులనే బాప్తిస్మమిచ్చు యోహాను గురించి కొంత ధ్యానించెదము.
బాప్తీస్మం మిచ్చు యోహాను యొర్దాను నదిలో ఎందు నిమిత్తమై ప్రజలకు బాప్తిస్మమును ఇచ్చుచుండెనో చూద్దాము. మత్తయి సువార్త 3:1-12లో బాప్తీస్మం మిచ్చు యోహాను ఇచ్చుచున్న బాప్తిస్మo ద్వారా ప్రజలు తమ పాపములు ఒప్పుకొని దేవుని వైపుకు తిరుగుట మనము గమనించగలము.
“మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను’’ (11వ వచనము)మరియు‘‘ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము’’(3వ వచనము). బాప్తీస్మం మిచ్చు యోహాను ఒంటె రోమముల దుస్తులు ధరించి, మిడతలు ఆహారముగా స్వీకరించుచు, అరణ్యములో కేక వేయుచుండెను. పరలోక రాజ్యమును గురించి, మారుమనస్సు నిమిత్తము బాప్తిస్మము గురించి ప్రకటించుచు చుండెను.
ఆయన ప్రజలను ఎలు గెత్తి పిలుచుచుండెను.‘‘మారు మనస్సు పొందండి, మానవాళికి రక్షకుడుగా రాబోతున్నాడు. ఆయనకు మార్గము సిద్ధరపరచండి. రక్షణ నిమిత్తము ఆయన మార్గము సరాళం చేయండి. అన్యదేవతలను ఆరాధించుట మానివేయండి మరియు ప్రభువును హృదయములో చేర్చుకొనండి’’. 
దేని నుండి వారు వెనుదిరిగవలయును?పాప భూయిష్టమైమన జీవన విధానము నుండి, విగ్రహారాధన నుండి వెనుదిరగవలయును. అందుకు ఏమి చేయవలెను?పరిశుద్ధపరచబడుటకై ప్రభువైన యేసునందు బాప్తిస్మము పొందవలెను. బాప్తీస్మం మిచ్చు యోహాను అరణ్యములో కేకలు వేయుచుండెను.‘‘రండి, నేనిచ్చు బాప్తిస్మము పొందండి, మీ పాపములు శుద్ధీకరించుకొనండి. మీ మెస్సయ్య, మీ రక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడు. పాత నిబంధనానుసారమైన బల్యర్పణా గొఱ్ఱెపిల్లగా వచ్చి, మీ పాపములు స్వీకరించి వాటి నుండి మిమ్ము పరిశుద్ధపరిచెను.’’
పాత నిబంధనలో ప్రజల అనుదిన పాపములు ప్రక్షాళన కొరకు, బలిగా అర్పించు జంతువు తలపై రెండు చేతులుంచబడును. పాపపరిహార దినమున ఇశ్రాయేలీయుల సంవత్సర పాపముల నిమిత్తమై, తలపై చేతులుంచుట ద్వారా వారి పాపములన్నియు బలి అర్పించబోవు మేకపైకి ప్రధాన యాజకుడు ఆరోపించును. ప్రతి సంవత్సరము 7వ నెల 10వ దినమున బలి అర్పించబడును (లేవీ 16:29-31).
అదే విధముగా మానవాళి సమస్త పాపములు, ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా, యేసుపైకి ఆరోపింపబడెను. తద్వారా ఆయన ఒక్కసారే మన పాపములు తొలగించెను. కనుకనే ప్రజలను పాపము నుండి మరలి యేసు వైపునకు తిరగవలసినదిగా, బాప్తిస్మము పొందవలసినదిగా బోధించుచుండెను.
యోహాను ఇచ్చిన బాప్తిస్మములోని ముఖ్య ఉద్దేశ్యము మానవుల మారుమనస్సు మరియు దాని ద్వారా ఇశ్రాయేలీయులకు రానైయున్న యేసు వైపునకు తిరుగుటయు నైయున్నది. మారుమనస్సు అనగా పాప జీవితము నుండి వేరుపడుట, మరియు తమ పాపముల క్షమపణా నిమిత్తము మెస్సయ్యగా రాబోవు యేసునందు విశ్వసించుట అయివున్నది.
త్వరలో రాబోవు, పాపములను శుద్దీకరించు మెస్సయ్య నిమిత్తమై, వారి విమోచన నిమిత్తమై ఇశ్రాయేలు ప్రజలు ఎదురుచూచుచున్నారు. అదే విధముగా 2000 సంవత్సరముల క్రితం పరలోకము నుండి దిగివచ్చి ఈ లోకపాపము నుండి మనలను శుద్దీకరించి యేసునందు మనము విశ్వాసముంచవలయును. అయితే పాతనిబంధన కాలములో ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రమును విస్మరించి, బల్యర్పణా విధానమును మార్చి, సరికాని బలులు అర్పించుచూ మెస్సయ్య రాకడ ప్రవచనమును మరిచిపోయారు.
ప్రజలకు త్వరలో రాబోవు మెస్సయ్య రాకడను తెలియ చేయు నిమిత్తము, ధర్మశాస్త్రమును గురించి గుర్తు చేయుటకు ప్రజలకు బాప్తిస్మమును ఇస్తూ ఆ క్రమములో యేసుకు కూడా బాప్తిస్మము ఇచ్చెను.
తమ విగ్రహారాధన నిమిత్తము, ధర్మశాస్త్రమును విస్మరించినందుకు పశ్చాత్తాపపడి అనేక ప్రజలు యోహాను వద్దకు వచ్చి బాప్తిస్మము పొందుచుండిరి. యేసుక్రీస్తు వారి బల్యర్పణలో మూడు ముఖ్యమైన విషయములు కలవు సజీవమైన గొఱ్ఱెపిల్ల మీద చేతులుంచుట మరియు రక్తము. ప్రభువైన యేసునందు విశ్వాసముంచినచో లోకములోని సకల మానవులు రక్షణ పొందగలరు.
పరిసయ్యులు, సద్దూకయ్యులు బాప్తిస్మము పొందుటకు వచ్చినప్పుడు, యోహాను ఈ విధముగా ఎలుగెత్తి పలికెను.‘‘సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు; దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను’’ (మత్తయి 3:7-9).
ఈ పరిశయ్యులు మరియు సద్దూకయ్యులు, రాజకీయ గుంపులు మరియు విగ్రహారాధికులు దేవుని వాక్యమునందు విశ్వాపముంచనప్పటికీ వారు దేవుని ప్రజలని తలంచుకొందురు. వారు ఇతర దవుళ్ళు మరియు తమ స్వంత ఆలోచనలయందు విశ్వాసముంచుదురు.
వారు బాప్తిస్మము నిమిత్తమై ఆయన వద్దకు వచ్చినప్పుడు బాప్తీస్మం మిచ్చు యోహాను ఈ విధముగా చెప్పసాగెను.‘‘మీరు సరికాని బలులు అర్పించవద్దు, పాపము నుండి వెనుతిరగండి, త్వరలో మీ సమస్త పాపములు పరిహరించు మెస్సయ్య రాకడ యందు విశ్వసించండి. ఇవి మీ హృదయమునందు విశ్వసించండి.’’
మారుమనస్సు అనగా తప్పుడు మార్గము నుండి వెనుదిరుగుట. పాపమునుండి వెనుదిరుగట, అబద్ధ విశ్వాసము నుండి మరలి యేసు వైపునకు తిరుగుటే నిజమైన మారుమనస్సు. యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువపైన ఆయన పొందిన తీర్పునందు విశ్వాసముంచవలెను.
అందుకై బాప్తీస్మం మిచ్చు యోహాను ప్రజలను ఎలుగెత్తి పిలుచుచుండెను. వారు దేవుని ధర్మశాస్త్రమును మరచితిరి. బల్యర్పణా విధానమును మార్చితిరి. వారు దేవుని వైపు తిరుగు నిమిత్తము యోహాను వారిని హెచ్చరించుచుండెను. ప్రజలను దేవుని వైపు మరల్చుటే యోహానుకు అప్పగింపబడిన బాధ్యత. అందువలన ప్రజలు యేసునందు విశ్వాసముంచి, తమ పాపముల నుండి రక్షింపబడవలయునని దేవుని ప్రణాళిక అయి వున్నది.
 

యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును బట్టి నీవు విమోచింపబడుదువని విశ్వసించుచున్నావా?
 
యేసు ఎదుట ప్రతి వ్యక్తి చేయవలసినదేమి?
తమ సమస్త పాపముల నుండి విడుదల పొందుటకై, రక్షింపబడుటకై ప్రభువైన యేసునందు విశ్వాసముంచవలయును.
 
ప్రభువైన యేసు తన బహిరంగ సేవా ప్రారంభంలో యోహాను వలన బాప్తిస్మము పొందుటే ఆయన చేసిన మొదటి పనియై ఉన్నది. ఆ విధముగా ఈ లోకపాపమంతయు ఆయనపై మోపబడినది.
ఈ లోక పాపమంతయు పరిహరించుటకు యేసు నెరవేర్చిన దేవుని నీతి మరియు మానవాళి రక్షణార్థము దేవుని ప్రణాళికలోని ప్రారంభకార్యమే యేసు పొందిన బాప్తిస్మము. తాను పొందిన బాప్తిస్మము ద్వారా యేసు ఈ లోక పాపమంతయు తొలగించెనన్న సత్యమునందు విశ్వసించిన వారినందరిని దేవుడు విమోచించెను.
యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మo పొందగానే, పరలోక రాజ్య సువార్త ప్రారంభమైనది. మత్తయి 3:15లో తెలియపరచబడిన విధముగా పరలోకము తెరువబడెను. పాతనిబంధనలో, లేవీకాండము 1:1-5 వరకు మరియు 4:27-31 వరకు తెలుపబడిన పాపపరిహారార్ధ బల్యర్పణను కచ్చితముగా పోలినది బాప్తిస్మ కార్యక్రమము.
పాత నిబంధనలో ప్రతిమాటకు నూతన నిబంధనలో ఒక జతకలదు. అలాగే నూతన నిబంధనలో ప్రతిమాటకు పాతనిబంధనలో ఒక జతకలదు.‘‘యెహోవా గ్రంధమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదియు లేక యుండదు దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ యిదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగుచేయును’’ (యెషయా 34:16).
 

సమస్త ప్రజల పాపపరిహార విషయము పాత మరియు నూతన నిబంధనలో వివరింపబడినది.
 
మన అనుదిన పాపముల నిమిత్తమై ప్రతిదినము పశ్చాత్తాపము చెందవలెనా?
లేదు. నిజమైన మారుమనస్సు ఏదనగా, ప్రతివారు తమ సమస్త పాపములు ఒప్పుకొని, విమోచన నిమిత్తమై యేసు పొందిన బాప్తిస్మమును మనస్సులోనికి తెచ్చుకొని విశ్వసించవలెను.

పాతనిబంధనలో, ప్రజలు ఒక దిన పాపముల నిమిత్తమై పరిహారము కొరకు తమ పాపములను, ఆ బలిపశువు తలపై చేతులుంచి దానిపై ఆరోపింపవలెను. అప్పుడు ఆ బలిపశువు వధింపబడి, ఆ పాపికి ప్రత్యామ్నాయముగా తీర్పుపొందును. అదే విధముగా ప్రజలందరి సంవత్సర పాపముల విషయమై కూడా మీద చేతులుంచబడి, ప్రజల పాపములు ఆరోపింపబడిన ఆ బలిపశువు బల్యర్పణ చేయబడగా, వారి సంవత్సర పాపములు కూడా క్షమించబడును.
 నూతన నిబంధనలో, అదే విధముగా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి యొర్దానులో తాను పొందిన బాప్తిస్మము వలన లోకపాపమంతయు ఆయనకు ఆరోపింపబడెను. పాతనిబంధనలో దేవుని ప్రవచనాత్మకమైన వాక్యము ఆ విధము నెరవేర్చబడెను.
యేసు ప్రభువుకు బాప్తిస్మమిచ్చిన యోహాను, యేసుకంటే ఆరు నెలలు ముందుగా ఈ లోకమునకు పంపబడిన దేవుని సేవకుడై యున్నాడు. యేసు ఈ లోకపాపమంతయు మోసికొని పోయెనని, యోహాను సువార్త 1:29లో ఆయన సాక్ష్యమిచ్చెను.‘‘ఇదిగో! లోక పాపమునంతయు మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల.’’
యొర్దానులో యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చుట ద్వారా యోహాను ఈ లోక పాపమంతయు ఆయనపై ఆరోపించెను. ఈ విధముగా మానవాళి సమస్త పాపములకు ప్రభువే పరిహారమాయెను.ఇప్పుడు కేవలము మనము చేయవలసినది. ఈ సువార్తయందు విశ్వాసముంచుటయే.
ఈ లోక పాపమంతయు ప్రభువైన యేసుక్రీస్తుపై మోపబడినది. అపోస్తలుల కార్యములు 3:19లో శిష్యులు ఈ విధముగా తెలిపిరి. ‘‘ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చునట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును, మీ పాపము తుడిచివేయబడు నిమిత్తమును, మారుమనస్సు నొంది తిరుగుడి.’’
ఎందువలన బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చెనో మరియు ఆయనను అనుసరించమని ఎందులకు ఎలుగెత్తి తెలిపెనో ఆ విషయమును మనము అర్ధము చేసికొనవలెనని శిష్యులు ఆ విధముగా బోధించిరి. ‘‘ మారుమనస్సు నొందితిరుగుడి.యేసుక్రీస్తు బాప్తిస్మమునందున్న విమోచనను విశ్వసించుడి. మీ పాపములను శుద్ధి చేసుకొనుడి.’’
మెస్సయ్య ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొంది మన పాపములన్నియు ఒక్కసారిగా తుడిచివేసెను.ఈవిధముగా లోకపాపములన్నియు యేసుక్రీస్తుపై మోపబడినవి. యేసుపొందిన ఈ బాప్తిస్మము ద్వారా మత్తయి సువార్త 3:13-17లో దేవుని వాగ్దానము నెరవేర్చబడెను.
‘‘ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను.అందుకు యోహాను ` నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మపావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.’’
దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చుటకు యేసుక్రీస్తు యోహాను వద్దకు వచ్చి బాప్తిస్మము పొందెను. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రత్యేకమైన దైవసేవకుడు. లూకా సువార్త 1వ అధ్యాయము ప్రకారము ఈ యోహాను మొదటి ప్రధాన యాజకుడైన అహరోను వంశీకుడు. అహరోను వంశీకుడైన ఈ యోహానును దేవుడు నియమించుకొనెను. ఎందుకనగా సకల మానవాళికి ప్రతినిధిగా ఈ యోహాను దేవుని యొక్క నీతి యావత్తు నెరవేర్చవలసి యున్నది.
అందుకై దేవుడు యేసుక్రీస్తు కంటే ఆరునెలలు ముందుగా ఈ యోహానును యాజకుని గృహములో జన్మింపజేసెను. అరణ్యములో ఎలుగెత్తి పిలచుచు బాప్తిస్మమిచ్చుయోహాను యేసుక్రీస్తునకు మార్గము సిద్ధము చేసెను. ‘‘సర్పసంతానమా, మారుమనస్సు పొందుడి!పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుడి. మెస్సయ్య రాబోతున్నాడు. ఆయన వైపు తిరుగుడి, లేనియెడల ఆయన మిమ్మును అగ్నిలోనికి త్రోసివేయును. ఆయన పొందిన బాప్తిస్మమునందు మరియు సిలువ రక్తమునందు విశ్వాసముంచుడి. మారుమనస్సు పొంది బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు విమోచింపబడుదురు.’’
అపోస్తలుల కార్యములు 3:19లో విమోచనాత్మకమైన ఈ సువార్త స్పష్టముగ వివరింపబడెను. బాప్తిస్మమిచ్చు యోహాను ఎలుగెత్తి మానవుల పాపముల నిమిత్తమై అరచినప్పుడు అనేకులు మారుమనస్సు పొందిరి.
బాప్తిస్మమిచ్చుయోహాను లోకపాపములన్నియు యేసుపై ఆరోపించెను. గనుక మానవాళి సమస్త పాపములు ఒక్కసారిగా తుడిచివేయబడెను. బాప్తిస్మమిచ్చుయోహాను సాక్ష్యమిచ్చినట్టుగా యేసు ఈ లోకపాపమంతయు స్వీకరించెను. నీరు మరియు ఆత్మ రక్తముతో కలసియున్న సువార్తే. విమోచనాత్మకమైన సువార్త. కనుక దీనియందు విశ్వాసముంచి మనము రక్షింపబడవలయును.
 

బాప్తిస్మమిచ్చు యోహాను యేసు కంటే ముందుగా జన్మించుటకు కారణము
 
‘‘ఇప్పటికి కానిమ్ము!’’ అన్న మాటలోని అర్థములేవి?
1) క్రమమైనది
2) సరియైనది
3) ఈ పద్ధతిలోనే చేయవలసినది.
(ఇంక ఏ యితర మార్గము లేదు.)
 
పాపము శుద్ధీకరింపబడిన వారు రక్షకుడైన యేసునందు విశ్వాసముంచి మత్తయి సువార్తలో ఉదాహరింపబడిన ఈ బాప్తిస్మము యొక్కసాక్ష్యమును బట్టి వారి రక్షణ యొక్క నిశ్చయత పొందవచ్చును. మత్తయి 3:15-16లో యేసు యోహాను వద్ద వచ్చి‘‘నాకు బాప్తిస్మము నిమ్ము.’’ అని అడుగగా యోహాను ఈ విధముగా జవాబిచ్చెను.‘‘నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగానీవు నా యొద్దకు వచ్చుచున్నావా.’’ అని నివారింపజూచెను.
యేసు ఎవరో ఎరిగి బాప్తిస్మమిచ్చుయోహాను ప్రభువుకు బాప్తిస్మమిచ్చెను. ఈ యోహాను దేవుని సేవకునిగా ఈ లోకపాపములన్నియు యేసుపై మోపుటకు పంపబడెను. ఈ లోకమున అవతరించెను. అందువలననే తనకు బాప్తిస్మమునిమ్మని, తన తలపై చేతులుంచుట ద్వారా ఈ లోకపాపము నంతయు యోహాను యేసుపై ఆరోపించునని యెరిగి ప్రభువు యోహానును అడిగెను.
ఎందువలన? సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడైన యేసు మన రక్షకుడు. ఆయన మన పాపములన్నియు శుద్ధీకరించుటకు వచ్చెను. కనుక మానవులను వారి పాపముల నుండి రక్షించుటకు యేసు తప్పనిసరిగా బాప్తిస్మము పొందవలసి వచ్చెను.
“ఇప్పటికి కానిమ్ము” యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వలన బాప్తిస్మము పొంది మన పాపమును శుద్ధీకరించెను. మనకు ప్రత్యామ్నాయముగా ఆయన సిలువపై తీర్పు పొందెను. యేసు పొందిన ఈ బాప్తిస్మము మన రక్షణకు సాక్ష్యమైయున్నది. పాతనిబంధనలో ప్రజల పాపములన్నియు బల్యర్పణచేయు మేకపై ఆరోపింపబడునని దేవుడు వాగ్దానము చేసెను. దేవుని కుమారుడైన యేసే గొఱ్ఱె పిల్లగా ఈ లోకపాపమంతయు తనపై మోపుకొనెను.
పాతనిబంధనలోని ‘మీద చేతులుంచుట’ మరియు నూతన నిబంధనలోని యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము ఈ రెండింటి ద్వారా పాపములు ఆరోపింపగా నీరు మరియు ఆత్మ సంబంధమైన సువార్తయందు విశ్వాసముంచువారికి తద్వార రక్షణ మరియు నిత్యజీవము అనుగ్రహింపబడెను.
 
 
యేసు పొందిన బాప్తిస్మము మన పాపములను సంపూర్ణముగ శుద్ధీకరించెను.
 
మనము యేసుపై మన పాపములు ఎలా పెట్టగలము?
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుటచే.
 
యేసు బాప్తిస్మము పొందగోరినప్పుడు యోహాను ‘‘నేను నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా’’ అని నివారింపజూచెను.
 అయితే యేసు ‘‘ఇప్పటికి కానిమ్ము నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను.’’ ఇప్పటికి కానిమ్ము. అని యేసు యోహానుతో చెప్పెను.‘‘నీవు సమస్త ప్రజల పాపములను నాపై ఆరోపింపుము. అందువలన నీరు మరియు విమోచనాత్మకమైన సువార్తను విశ్వసించువారి నందరిని నాయొద్దకు చేర్చుకొనగలను. అప్పుడు వారిపాపము నిమిత్తమై నేను తీర్పు పొందెదను. కనుక నా యందు మరియు నా బాప్తిస్మమునందు విశ్వసించువారు, వారి పాపముల నుండి విమోచన పొందుదురు. ఈ బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు నాపై మోపవలసినదే. దానివలన నా యొద్దకు తరువాత కాలములో వచ్చువారందరు వారి పాపమునిమిత్తమై ఒక్కసారిగా విమోచింపబడుదురు. కనుక ఇప్పటికి కానిమ్ము.’’ అని సెలవిచ్చెను.
యేసు యోహాను వలన బాప్తిస్మము పొందెను. యేసు పొందిన ఈ బాప్తిస్మము దేవుని విమోచనాత్మకమైన నీతియుక్తమైన ఆజ్ఞకు అనుసందానింపబడినది. అందువలన ఆయన బాప్తిస్మము పొందగానే మన పాపములన్నియు ఆయనపై మోపబడినవి. దానివలన యేసునందు విశ్వాసముంచి బాప్తిస్మము పొందినవారి పాపము ఒక్కసారిగా విమోచింపబడును. మీద చేతులుంచుట ద్వారా మన పాపములన్నియు ఆయనే స్వీకరించి మనకు ప్రత్యామ్నాయముగా సిలువలో మరణించెను. ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చిండియుండెను. నీరు మరియు ఆత్మలో నున్న విమోచనయందు విశ్వాసముంచి మనము రక్షింపబడగలము.
ఈ లోక పాపములన్నిటి నుండి మనలను రక్షించినవాడే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు మన పాపములన్నియు స్వీకరించెను. పాపమునకు జీతమైన మరణమును సిలువపై పొందియున్నాడని తెలిసికొనుడి. యేసు పొందిన ఈ బాప్తిస్మము విమోచనాత్మక సువార్తకు ఆరంభమై యున్నది. 
బైబిలులో ఈ విమోచనాత్మకమైన బాప్తిస్మము అనేక చోట్ల తెలియపరచబడినది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు పత్రిక వ్రాస్తూ తాను యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడితిననియు, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొంది క్రీస్తుయేసు ధరించియున్నానని తెలియపరచెను. ఇక్కడ యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణములోనున్న విమోచనాత్మకమైన విశ్వాసమును గురించి అపోస్తలుడైన పౌలు మాటలాడుచున్నాడు.
 

“ఇప్పటికి కానిమ్ము”
 
బాప్తిస్మమిచ్చుయోహాను పాత్ర ఏమైయున్నది?
మన పరలోకప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుపైకి ఈ లోకపాపమంతయు ఆరోపించెను.
 
“నీతియావత్తు ఈలాగునెరవేర్చుట మనకు తగియున్నది.’’ అనియేసు సెలవిచ్చెను.నీతియావత్తు అనగా ఆయన పొందిన బాప్తిస్మము వలన సకల పాపములు తుడిచివేయబడగా ప్రజలు తమ హృదయములలో కూడా పాపరహితముగా వుండుటయే.‘‘అతడాలాగు కానిచ్చెను’’.అప్పుడుయేసు యొర్దానులో బాప్తిస్మము పొందెను.
ప్రధాన యాజకుడు పాపపరిహారార్ధ బలిపశువు తలపై తన రెండు చేతులు ఏలాగువుంచునో అదే విధముగా బాప్తిస్మమిచ్చు యోహాను యేసుప్రభువు తలపైన తన చేతులుంచి లోకపాపమునంతయు ఆయనపై మోపెను. బాప్తిస్మమిచ్చుయోహాను ప్రధాన యాజకుడుగా మరియు మానవులకు ప్రతినిధిగా యేసుపై ఈ లోకపాపమంతయు ఆరోపించెను.‘‘దేవా, ఈ లోకపాపమంతయు నీ గొఱ్ఱె పిల్లయైన యేసుపై మోపుచుంటిని’’.అప్పుడు మానవాళి పాపమంతయు ప్రభువైన యేసు స్వీకరించెను.
బాప్తిస్మమిచ్చు యోహాను యేసు తలపై తన చేతులుంచి, ఆయనను నీటిలో ముంచి, యేసు నీటిలో నుండి బయటకు రాగా తన చేతులను తొలగించెను. యేసుక్రీస్తు పొందిన ఈ బాప్తిస్మము ద్వారా నీతియుక్తమైన రక్షణ నెరవేరెను. ఆయన బాప్తిస్మమునందు విశ్వసించు వారినందరిని యేసు రక్షించెను.
 

ఆకాశము తెరువబడి పరలోకము నుండి ఒక శబ్దము వినిపించెను.

పరలోక రాజ్యము ఎప్పుడు తెరువబడెను?
బాప్తిస్మమిచ్చుయోహాను కాలమునుండి తెరువబడెను. (మత్తయి 11:12)
 
“యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.’’(మత్తయి 3:16-17)
యేసు బాప్తిస్మము పొంది లోకపాపమంతయు స్వీకరించగానే పరలోకము తెరువబడెను. అప్పుడు అనేక సంవత్సరములకు ముందుగా దేవుడు చేసిన వాగ్దానము యొర్దానులో యేసు బాప్తిస్మము పొందుట ద్వారా నెరవేర్చబడెను.
అప్పుడు యేసు దేవుని గొఱ్ఱెపిల్లగా ఈ లోకపాపమంతయు తానే స్వీకరించి, మానవాళినంతయు తమ పాపముల నుండి రక్షించెను. ఈ లోకపాపమంతయు యేసుక్రీస్తుపై ఆరోపింపబడగా దేవుని చిత్తము నెరవేర్చబడెను.యోహాను 1:29లో దీనికి సాక్ష్యమివ్వబడెను.‘‘ఇదిగో! లోక పాపమును మోసికొని పోవు దేవుని గొఱ్ఱ పిల్ల!’’ దేవుని గొఱ్ఱె పిల్లయైన యేసుపై సమస్త పాపములు మోపబడగా గొల్గొతాలోని సిలువపథములో ఆయన సాగిపోయి మూడు సంవత్సరముల తరువాత తన భుజస్కంధములపై నున్న పాపభారము నిమిత్తము సిలువ వేయబడెను. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా సకల లోకపాపములను స్వీకరించెను గనుక విశ్వాసముతో యేసు స్వీకరించిన వారి యొక్క పాపములన్నియు క్షమింపబడునని తెలియజేసెను.
యోహాను 8:11లో పాపమునందు పట్టబడిన ఆ స్త్రీతో ప్రభువు ఇట్లనెను.‘‘ నేనూ, నిన్ను శిక్షింపను.’’ ఆయన ఆ వ్యభిచారిని శిక్షింపలేదు. ఎందుకనగా ఆమెకు ప్రత్యామ్నాయముగా యేసే తీర్పు పొందవలయును. అప్పటికే లోకపాపమంతయు ఆయన స్వీకరించెను. అందుకే నేను పాపుల రక్షకుడనని ప్రభువు తెలియజేసెను.
దేవుని కుమారుడైన యేసు మానవరూపిగా అరుదెంచి ఈ లోకములోనున్న ప్రతి విశ్వాసిని శుద్దీకరించెను.ఆయన బాప్తిస్మము పొందినప్పుడు పరలోకము తెరువబడెను. పరలోకరాజ్యము యొక్క ద్వారము తెరువబడెను. ఈ సత్యమునందు విశ్వసించిన వారు సులభముగా పరలోకములోనికి అడుగు పెట్టెదరు.
 

ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపములను తొలగించిన యేసు సిలువ వేయబడెను.
 
సైతాను తలను యేసు ఏ విధముగాచితుకగొట్టెను?
మన పాపము నిమిత్తమై తీర్పుపొంది మృతులలో నుండి పునరుత్థానుడై సాతాను తలను చితుకగొట్టెను.
 
ఈ లోకపాపములన్నియు ఆయన తపై మోపబడగా యేసు సిలువపైన తీర్పుపొందెను. ఆయన మానవాళి పాపముల నిమిత్తమైన సిలువవేదన విషయమై చింతాక్రాంతుడాయెను. ఆయన చెమట రక్తముతో కలసి వచ్చు పర్యంతము ప్రార్థన చేసెను. తన శిష్యులతో కూడి గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు‘‘నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము.’’ (మత్తయి 26:39) అని ప్రార్థించెను. నేను బాప్తిస్మము పొంది ఈ లోకపాపమంతయు స్వీకరించితిని దాని నిమిత్తమై ఇప్పుడు సిలువను అధిరోహించ బోతున్నాను. అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుడా ప్రార్థనకు జవాబివ్వలేదు.
 పాత నిబంధనలో పాపపరిహార దినమందున, పాపపరిహార బలిపశువు చంపబడి ప్రధానయాజకునిచేత దాని రక్తము కరుణాపీఠము ముందు ప్రోక్షింపబడును. అదే విధముగ యేసు కూడా సిలువయందు మరణించి స్వరక్తమును కార్చవలసియున్నది. కనుక దీనికి ప్రత్యామ్నాయముగా వేరేదీ లేకపోవుట చేత యేసు పొందిన సిలువ మరణమే దేవుని చిత్తమాయెను.
బలిపీఠము దేవుని తీర్పు అయివున్నది మరియు రక్తము జీవమైయున్నది. తీర్పు తీర్చబడుటే ఆ కరుణాపీఠము వద్ద ఏడుసార్లు ప్రోక్షించబడిన ఈ రక్తమునకు అర్థము. (లేవీ 16:1-22).
దేవుని చిత్తమైతే ఈ గిన్నె తన యొద్ద నుండి తొలగించమని యేసు ప్రార్థించెను. తండ్రి దానికి సమ్మతించకపోవుట వలన‘‘నా చిత్తము కాదుగాని, నీ చిత్తమే నెరవేరనిమ్ము’’(మత్తయి 26:39). అని యేసు పలికెను. తాను సరియైన విధానముగా యెంచిన దేవుని చిత్తమునే జరుగనిమ్మని యేసు తెలిపెను. అటుపిమ్మట ఆయన ప్రార్థన చాలించి తన తండ్రి చిత్తమును నెరవేర్చెను.
యేసు తన చిత్తమును తృణీకరించి తండ్రి చిత్తమునకు ఎందువలన విధేయుడాయెను?ఈ లోకపాపములన్నియు స్వీకరించి వాటి నిమిత్తమై తీర్పుపొందని యెడల రక్షణాత్మకమైన దేవుని ప్రణాళిక సంపూర్ణము కాదు. ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా స్వీకరించిన లోకపాపమును బట్టి యేసు సిలువ వేయబడెను. ‘‘ పాపమునకు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము’’ (రోమా 6:23).
దేవుడు చేసిన నిబంధనను బట్టి మానవాళిని రక్షించుటకు పంపబడిన యేసుక్రీస్తు బాప్తిస్మము స్వీకరించి తన పైన చేతులుంచబగా మన రక్షకుడాయెను. యేసు దేవుని చిత్తమునకు విధేయుడై మనకు ప్రత్యామ్నాయముగా తీర్పుపొందెను.
ఆది 3:15లో తెలుపబడిన ప్రవచనమునకు ఇది నెరవేర్పు. ‘‘మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.’’ దేవుడు ఆదాముతో మెస్సయ్యను పంపించెదనని చేసిన వాగ్ధానమే ఈ ప్రవచనము. మానవాళిని పాపులుగా చేసి నరకమునకు పంపుతున్న అపవాది శక్తిని ఓడించుటకు యేసు స్త్రీ సంతానముగా ఈ ప్రవచనానుసారం ఈ లోకమునకు వచ్చెను.
యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ మరణము మన పాపములను శుద్ధీకరించినవని, మరియు మనము పొందవలసిన తీర్పు నుండి యేసు మనలను రక్షించినాడని తెలిసికొని విశ్వసించవలయును.
యేసు పొందిన ఈ బాప్తిస్మము మరియు చిందించిన సిలువ రక్తము తలంచినప్పుడు మన హృదయములలో ధృఢమైన విశ్వాసము కలిగియుండవలయును. మీ హృదయములలో దీనిని విశ్వసించిన యెడల మీరు రక్షింపబడుదురు.
 
 
యేసు పొందిన బాప్తిస్మము పరలోక సువార్తకు ప్రారంభము.

యేసు పరలోకమునకు ఆరోహణుడై పోవునప్పుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమి?
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు,పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి అని తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చెను.
 
యేసుపొందిన బాప్తిస్మమే సువార్తకు ప్రారంభము. ఆయన తాను పొందిన బాప్తిస్మము మరియు తన రక్తము వలన పాపులనందరిని రక్షించెను. మత్తయి 28:19లో ఈ విధముగా తెలుపబడినది.‘‘కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారునియొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.’’ యేసు తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామమునకు సాక్ష్యులుగా వుండవలసినదిగా తన శిష్యులకు ఆజ్ఞాపించెను. తన బాప్తిస్మము మరియు సిలువ మరణములే సమస్త మానవాళిని సకల పాపముల నుండి శుద్ధీకరించినవని, మరియు రక్షించినవన్న సత్యమునకు సాక్ష్యులుగా వుండమని కోరెను.
సమస్త జనులను శిష్యులుగా చేయుటకు యేసు వారికి అధికారము ఇచ్చెను. మరియు వారికి యేసుపొందిన నీటి బాప్తిస్మమే విమోచనాత్మకమైన బాప్తిస్మమనియు ఈ లోకపాపములను శుద్ధీకరించు బాప్తిస్మమనియు తెలియపరచమని ఆజ్ఞాపించెను.
2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమిపైకి సశరీరుడిగా అరుదెంచి బాప్తీస్మం మిచ్చుయోహాను ద్వారా బాప్తిస్మము పొందెను.ఈ బాప్తిస్మము వలన లోకపాపమంతయు అనగా మన పాపములు కూడా ఆయనపై ఆరోపింపబడెను.
ఎంత పాపము యేసుపై ఆరోపింపబడెను?రేపటి పాపముల విషయమేమిటి? భవిష్యత్‌ పాపములు కూడా ఆయనపై మోపబడినవని యేసు తెలిపెను. మన పిల్లల పిల్లల పాపములు అనగా భూత, వర్తమాన, భవిష్యత్‌ తరము పాపములు అనగా ఆదాము పాపముతో సహా సమస్తము యేసుపై మోపబడెను.
అసలు పాపము లేకుండా ఏవిధముగా ఉండగలము?మనము పాపము లేకుండా ఏలాగు జీవించగలము? యేసు మన పాపములు మరియు లోకములో వున్న ఇతర పాపములు అన్నియు తాను పొందిన బాప్తిస్మము ద్వారా తొలగించి, ఈ సత్యమునందు విశ్వసించినవారిని వారి పాపముల నుండి సంపూర్ణముగా విమోచించి, పరలోకరాజ్యమునకు వారిని వారసులుగా చేసెను.
“సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును’’ (యోహాను 3:21).
యేసు తాను పొందిన బాప్తిస్మo వలన మరియు సిలువలో చిందించిన రక్తము వలన, మరణించి తిరిగి పునరుత్థానుడగుట వలన మన పాపములను సంపూర్ణముగా శుద్ధీకరించెను. అందును బట్టి మనము ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణమును విశ్వసించి సమస్త పాపముల నుండి రక్షింపబడగలము. ఇదే విమోచనాత్మకమైన విశ్వాసము.
మనము ఎప్పుడైతే యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు విశ్వాసముంచుతామో వెంటనే రక్షించబడగలము.మనము యేసునందు సరైన రీతిలో విశ్వాసముంచినట్లయితే మనము నీతిమంతులమా, లేక పాపులమా? మనము నీతిమంతులమే. మనము అసంపూర్ణులమైననూ పాపము లేనివారమగుదుమా? అవును, మనము పాపము లేనివారమే. యేసుపొందిన బాప్తిస్మము నందు మరియు సిలువలో ఆయన పొందిన తీర్పునందు విశ్వాసముంచిన యెడల, మనము సంపూర్ణులమై నిజమైన విశ్వాసమును కలిగిన వారమగుదుము.
 

యేసు నామములో బాప్తిస్మమిచ్చుట మరియు బాప్తిస్మము స్వీకరించుట.
 
పరలోక సువార్త ప్రారంభమనగా నేమి?
యేసుపొందిన బాప్తిస్మమే.
 
ప్రజలు అసంపూర్ణులు గనుక దైవసేవకు, యేసుక్రీస్తు బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు విశ్వాసముంచువారికి, బాప్తిస్మమునిచ్చి వారి విశ్వాసమును దృఢపరతురు. తిరిగి జన్మించిన విశ్వాసులు రక్షణయను స్వాస్థ్యమును పొంది తమ విశ్వాసమునకు ఋజువుగా బాప్తిస్మమును స్వీకరించెదరు.
దైవసేవకులు తిరిగి జన్మించిన వారి తలపైన తమ చేతులుంచి దేవుని ఆశీర్వాదము నిమిత్తమై ప్రార్థింతురు. అందువలన ఈ వ్యక్తి తన జీవితాంతము యేసును సేవించుటకు నడిపింపబడును. అప్పుడు ఆ విశ్వాసికి తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్ముని నామములో బాప్తిస్మమిచ్చెదరు.
 యేసుపొందిన ఈ బాప్తిస్మము మరియు ఈ సిలువ రక్తమునందు మనముంచిన విశ్వాసమును ఆధారము చేసుకొని మనకు బాప్తిస్మమియ్యబడును. ఈ బాప్తిస్మమునకు అర్ధమేమనగా సకల పాపములు యేసుపై మోపబడినవనియు, బాప్తిస్మము స్వీకరించుచున్న వ్యక్తి యేసుతో కూడా చనిపోయి తిరిగి లేచెననియు అర్ధము.
బాప్తిస్మము పొందుట అనగా యేసు పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములు ఆయనకే ఆరోపింపబడినవి అన్న సత్యమును ప్రకటించుటయే. అదే విధముగా యేసుతో పాటు మన పాపములకు కూడా తీర్పు తీర్చబడినదనియు మరియు ఆయనతో కూడా మనము పునరుద్ధానం చెందితిమని శ్వసించుటయే. 
అంతే కాక తండ్రియెదుట కుమారుని యెదుట పరిశుద్ధాత్ముని యెదుట, విశ్వాసులైన సహోదర సహోదరీల యెదుట సాతానుకు బుద్ధికలుగునట్లు మన విశ్వాసమును ప్రకటించుటే. మరియు మనము నీరు మరియు ఆత్మద్వారా తిరిగి జన్మించితిమని ఒప్పుకొనుటయే.
యేసునందు విశ్వాసముంచి, ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువరక్తమును సరిగా అర్థము చేసికొని, లోకపాపముల నుండి రక్షింపబడితిమని విశ్వసించుటే ఈ బాప్తిస్మము. అందువలన అట్టి వారు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందుదురు.
“పాతవి గతించెను; ఇదిగో, సమస్తము కొత్తవాయెను” (2 కొరింథి 5:17). మన పాతవిషయము తొలగింపబడెను మనio విశ్వాసము ద్వారా తిరిగి జన్మించితిమి. ఈ సత్యమును మన హృదయములలో ధృడపరచుటకు బాప్తిస్మము కూడా స్వీకరించితిమి. మనము యేసు పొందిన బాప్తిస్మములో నమ్మకముంచి, బాప్తిస్మము పొందితిమి.
 

యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన సిలువ రక్తము ద్వారా తిరిగి జన్మించిన మన జీవితము ఎలాగుండవలెను?
 
తిరిగి జన్మించినవారు ఎందు నిమిత్తమై జీవించెదరు?
వారు దేవుని రాజ్యము నిమిత్తము మరియు ఆయన నీతి నిమిత్తము జీవించి సర్వలోకమునకు సువార్త ప్రకటించెదరు.

విమోచింపబడి తిరిగి జన్మించినవారు దేవుని వాక్యమందు సంపూర్ణమైన విశ్వాసము కలిగియుండవలెను. అనుదినము తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడుచూ తన మానసిక ఉద్రేకతను బట్టి జీవించు జీవితము కాదది. అట్టి విశ్వాస జీవితములో అనుదినము యేసుపొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములు తొలగించబడినవని కలిగిన నిశ్చయతతో జీవించవలెను.
యేసు బాప్తిస్మము పొందినప్పుడే మన పాపములన్నియు ఆయనపై మోపబడినవి. ఆ భారము వహియించి ఆయన మూడు సంవత్సరములు జీవించి మన పాపముల నిమిత్తమై శిక్షను అంగీకరించి సిలువవేయబడెను.
కనుక విశ్వాసులమైన మనము లేఖనమును నమ్మవలయును గానీ మన భావోద్రేకమును కాదు. మనకు ఈ విధమైన ఆచరణాత్మకమైన విశ్వాసము లేని యెడల మన అనుదిన పాపముల నిమిత్తమై అనగా మనము విమోచింపబడి, తిరిగి జన్మించిన తదుపరి జరుగు అసంకల్పిత పాపముల నిమిత్తమై విచారించగలము.
మనము ఈ పాపవిషయమైన దృష్టిని తొలగించి నీరు మరియు రక్తముతో కూడిన సువార్త నందు మాత్రమే విశ్వసించవలయును. విమోచించబడిన వారి జీవన విధానము ఈ విధముగా ఉండవలయును.
యేసు గురించి బాప్తీస్మం మిచ్చుయోహాను ఏమి పలికెను?‘‘ఇదిగో లోకపాపములను మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల’’ (యోహాను 1:29). మానవుల మూల పాపములను, నేటి, రేపటి మరియు నిన్నటి పాపములన్నియు యేసు స్వీకరించెనని యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు.
ఆయన ఆ పాపములన్నియు తొలగించలేదా?మన పాపములన్నియు యేసుపై మోపబడలేదా? ఈ లోకపాపమనగా మనందరి గత, వర్తమాన, భవిష్యత్‌ పాపమని అర్థము. యేసుపొందిన బాప్తిస్మము ద్వారా మనకు లభించిన ఈ విమోచనా సువార్తను మన జీవితములో ధృడపరచుకొనవలెను.
యేసు పొందిన బాప్తిస్మము మరియు రక్తమునందు విశ్వాసముంచినవారు రక్షింపబడుదురు. యేసుపొందిన బాప్తిస్మమును విశ్వసించిన వారి హృదయములలో పాపము నిలచియుండదు.
అనేకమంది తామింకను పాపములు కలిగియున్నారని భావించెదరు. యేసుపొందిన బాప్తిస్మము ద్వారా వారి సమస్త పాపములు ఆరోపింపబడినవని వారెరుగరు. వారు అపవాది చేత మోసగింపబడుచున్నారు. అపవాది వారి శరీర ఉద్రేకమును బట్టి వారితో గుసగుసలాడును.‘‘నీవు ప్రతిరోజు పాపములు చేస్తున్నావు గదా, నీవు ఎలా పాపరహితుడవు కాగలవు?’’ అని ప్రశ్నిస్తాడు. 
కేవలము వారు దేవుని విశ్వసించుట వలన పాపము లేనివారగుదురు. అయిన్పటికి వారియందు పాపము కనబడును గనుక వారు పాపులే అని అపవాది మనలను మభ్యపెట్టును మనమీ లోకములో అసంపూర్ణులముగా మరియు బలహీనులముగా జీవించుచున్నాము.
మనము మన క్రియలు మరియు మంచి కార్యముల ద్వారా నీతిమంతులము ఎన్నడూ కాలేము. అయితే యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణముయందు విశ్వాసముంచి రక్షింపబడితిమన్న సత్యము గ్రహించిన చాలు. మనకు, యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన రక్తమును గురించి అవగాహన సరిగా వున్నట్లయితే మన హృదయము శుద్ధీకరింపబడి మనము పాపములేనివారమని నిశ్చయించుకొందుము.
‘’♬నీవువిమోచింపబడితివి,నేనువిమోచింపబడితిని,మనమందరము విమోచింపబడితిమి.’’మనముఆత్మచేత నడిపించబడి ఈ సువార్తను ప్రకటించినట్లయితే మన జీవితము సంతోషభరితముగా మరియు ఆనందకరముగా ఉండును.
విశ్వాసులమైన మనము ప్రతిదినము అసంకల్పిత పాపమును చేయుచుందుము. అయినా మనలో పాపము నిలిచియుండును. మన హృదయములలో యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తము నిలిచియున్నవి. మన హృదయములలో పాపము కలిగియున్ననూ, యేసుపొందిన బాప్తిస్మమునందు విశ్వాసముంచిన మనలో పాపము ఏవిధముగా నిలచియుండును?
‘‘ఆదినములైన తరువాత నేను వారితో చేయబోవునిబంధనఇదేనా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును’’(హెబ్రీ 10:16).
 ఇప్పుడు మన హృదయములు పాపమునుండి విడిపించబడినవి. యేసు పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము వలన మనము సంపూర్ణముగా విమోచింపబడుటకు వీలు కలిగెను. పాపమునుండి రక్షణ దేవుని యొక్క వాక్యములో నుండి ఉద్భవించును.
 

యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువమరణమునందు హృదయపూర్వకముగా విశ్వసించినవారు మరెన్నటికి పాపులు కారు.

మనము మరలా పాపము చేసిన యెడల పాపులగుదుమా?
లేదు. మరెన్నటికీ పాపులము కాము.
 
మనము యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు రక్తమునందు విశ్వాసముంచక పాపక్షమాపణ నిమిత్తమై ఎన్నిసార్లు ప్రార్థించిననూ మన హృదయములో పాపము వుండక మానదు. అయితే మనమీ సత్య సువార్తయందు విశ్వాసముంచిన యెడల మన పాపములన్నియు శుద్ధీకరించబడును.
“ఏమండీ, మీరు ఈ రోజులలో ఎంతో ప్రకాశవంతముగానూ,సంతోషముగానూ కనపడుతున్నారు ఎందుచేత?’’
‘‘నా హృదయములో పాపము లేదు గనుక’’
 “ నిజమా? అయితే, ఇక మీదట నీవు ఎంత పాపమైనా చేయవచ్చును గదా?’’
లేదు,‘‘ఒక్కవిషయం మీరు తెలుసుకోవాలి మనిషి స్వతహాగా పాపియే అయితే యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా ఈ లోకపాపమంతయు స్వీకరించి, వాటి నిమిత్తమై సిలువలో తీర్పుపొందెను. అందువలన నేనిప్పుడు సంఘములో సువార్తప రిచర్యలో కూడా కొనసాగుతున్నాను. రోమా 6వ అధ్యాయములో మనమందరము అదే విధముగా జీవించవలెనని తెలియజేసెను. ఇక నా హృదయములో పాపము లేదు గనుక నేను నీతియుక్తమైన పనులన్నీ చేయగోరుతున్నాను. నము ఈ సువార్తను లోకమంతట ప్రకటించుటకు ముందుగా యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువలో చిందించిన రక్తమునందు విశ్వాసముంచవలయును. మన రక్షణకర్తయైన యేసునందు విశ్వాసముంచిన యెడల మనమిక మీదట ఎన్నడూ పాపులము కాబోము. మనము ముఖ్యముగా యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువరక్తము ద్వారా లభించిన నిత్యమైన విమోచనలో విశ్వాసముంచవలయును. నా హృదయము ఎంతో కృతజ్ఞతతో నిండియున్నది!’’
 

ఎవరు ఆత్మను పొందగలరు?
 
బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుగురించి ఏమని సాక్ష్యమిచ్చెను?
యేసే లోకపాపమంతయు మోసికొని పోయిన దేవుని గొఱ్ఱెపిల్లయని సాక్ష్యమిచ్చెను. అనగా మన గత, వర్తమాన, భవిష్యత్‌ మరియు మూల  పాపములన్నియు పరిహరించెను.
 
యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువలో చిందించిన రక్తమునందు విశ్వాసముంచిన వారు రక్షణను పొందుదురు.అయితే మనము ఆత్మను ఏలాగు పొందగలము?అపో. 2:38-39లో దీనికి జవాబున్నది.‘‘పేతురు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్ధానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికినీ, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికినీ చెందునని వారితో చెప్పెను.’’
యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట అనగా యేసు పొందిన బాప్తిస్మమునందు విశ్వాసముంచి రక్షింపబడుటయే. అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును దేవుడు వారికి అనుగ్రహించును.
యేసుక్రీస్తు నందు బాప్తిస్మము పొందుట అనగా ఆయన యొక్క బాప్తిస్మము మరియు రక్తమునందు విశ్వాసముంచి శుద్ధీకరింపబడుటయే.మనo ఈ విశ్వాసమును హత్తు కొనిన యెడల, విమోచింపబడి నీతిమంతులము కాగలము. యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తములో విశ్వాసముంచిన వారి హృదయము మంచుకంటే తెల్లనివగును.
“అప్పుడు నీవు పరిశుద్ధాత్మ అనువరము పొందుదువు.’’ మన పాపములన్నియు యేసుపొందిన బాప్తిస్మముద్వారా ఆయనపై మోపబడినవనియు మరియు వాటి నిమిత్తమై తీర్పుపొంది సిలువపై మరణించుట ద్వారా మన హృదయములు శుద్ధీకరించబడినవని ధృడముగా విశ్వసించవలయును. మనము ఈ విధమైన విశ్వాసముతో నిండియున్నప్పుడు పరిశుద్ధాత్మ అనువరమును పొంది దేవుని పిల్లలుగా మారి నూతనమైన జీవితమును ప్రారంభించగలము.
“అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’’ (యోహాను 8:32). మనము యేసు సిలువపై పొందిన తీర్పును గురించిన సంపూర్ణ అవగాహన కలిగియుండవలయును. ప్రభువైన యేసు ఆయన బాప్తిస్మము ద్వారా మరియు సిలువ మరణము ద్వారా మన పాపములన్నియు తొలగించెను అనునది సత్యము. మనoఈ సత్యమునందు విశ్వాసముంచగనే విమోచన సిద్ధించును.
 

యేసు పొంది బాప్తిస్మము మనలను విమోచించెను.
 
ఎవరు ఆత్మను పొందగలరు?
యేసుపొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము నందు విశ్వాసముంచుట వలన విమోచింపబడిన వారు ఆత్మను పొందగలరు.
 
పాతనిబంధనలో బల్యర్పణ విధానము ద్వారా సమకూడిన పాపపరిహారమే నూతన నిబంధనలో యేసుక్రీస్తు బాప్తిస్మము ద్వారా శాశ్వతముగా అనుగ్రహింపబడెను. పాత నిబంధనలోని ప్రవచనములన్నిటిలో దాగిన మర్మము యేసు యొక్క బాప్తిస్మమే అని గ్రహించవలయును. పాతనిబంధనలో బలిపశువు తలపైన చేతులుంచుటకు సమానమైనదే నూతన నిబంధనలో యేసుపొందిన బాప్తిస్మము.
ఈ లోకపాపమంతయు యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము ద్వారా ఆయనపై మోపబడెను. ఇదియు ఇశ్రాయేలీయుల పాపములన్నియు తన తలపై చేతులుంచుట ద్వారా విడిచిపెట్టబడిన మేకపైన మోపుటకు సమానమైనది.
మన పాపముల నుండి విమోచన పొందుటకు యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మo నందు విశ్వాసముంచవలయునా? అవును! తప్పక విశ్వాసముంచవలయును!యేసు తాను పొందిన బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు తొలగించెనను సత్యమును మనము హృదయపూర్వకముగా అంగీకరించవలయును. మనo ఈ విధముగా విశ్వసించి ఒప్పుకోని యెడల మన పాపములు ఆయనపై ఆరోపింపబడవు. మన రక్షణను సంపూర్ణము చేసికొనుటకు మనము తప్పనిసరిగా ఈ సత్యమును విశ్వసించవలయును. లేని యెడల మనము నీతిమంతులము కాలేము.
యేసు ఈ లోకములోని పాపులందరినీ సరియైన మరియు నీతి యుక్తమైన విధానములో ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా రక్షించెను. ఇంతకంటే సరియైన విధానములో ఈ విమోచనా కార్యము జరిగించుట అసంభవము. యేసుపొందిన బాప్తిస్మము ద్వారా మాత్రమే లోకపాపమంతయు ఆయనపై ఆరోపింపబడును. గనుక మనము ఈ సత్యమును హృదయములో విశ్వసించి శాశ్వతముగా పాపము నుండి శుద్ధీకరణ పొందగలము.
మరియు మనము యేసు చిందించిన రక్తము ద్వారా మన పాపములకు తీర్పు పొందగలిగితిమని విశ్వసించవలయును. అప్పుడే, యేసు యొక్క బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందు విశ్వసించి పాపములనుండి రక్షింపబడగలము.
పరలోకరాజ్యములోనికి ప్రవేశించవలెనంటే మనమీ యేసుపొందిన బాప్తిస్మమునందు విశ్వాసముంచవలయును. మనకు లభించవలసిన శిక్షనుండి ఆ విధముగా విడుదల పొందగలము.
నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు పాతనిబంధనలో మీద చేతులుంచు ఇవి రెండూ ఒకదానికొకటి ప్రతిబింబించు అద్దములై యున్నవి. పాత మరియు నూతన నిబంధనను జతచేయు మాటలు ఇవే .
నూతన నిబంధనలో బాప్తీస్మం మిచ్చు యోహాను యేసుక్రీస్తు కంటే ఆరు నెలలు ముందుగా జన్మించెను. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందగానే, ‘‘దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము’’(మార్కు 1:1) జరిగినది. యేసు, బాప్తిస్మము ద్వారా లోకపాపమంతయు స్వీకరించిన వెంటనే సువార్త ప్రారంభమాయెను.
మానవాళి యొక్క విమోచన ఒకదానితో ఒకటి పెనవేసుకున్న కొన్ని సందర్బములను బట్టి నెరవేర్చబడెను. అవి యేసుక్రీస్తు యొక్క జననము, బాప్తిస్మము, సిలువ మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము. రక్షణ ప్రణాళికలో దాగిన ఈ గొలుసు బందమును మనము సరిగా అవగాహన చేసికొన్నట్లయితే, మనo పాపము నుండి రక్షింపబడెదము. యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము సువార్తకు ప్రారంభము కాగా సిలువపై ఆయన చిందించిన రక్తము ద్వారా సమాప్తమాయెను. 
‘‘దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము’’ (మార్కు1:1). ఆయన చేసిన నీతియుక్తమైన కార్యము అనగా బాప్తిస్మము, సిలువరక్తము, పునరుత్థానము, ఆరోహణ మరియు రెండవ రాకడ మొదలగు వాటిలో దేవుని కుమారుని యొక్క సువార్త నుండి దేనిని తొలగించలేము.
 యేసు ఈ లోకమునకు శరీరధారిగా అరుదెంచి ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మానవాళి పాపములన్నియు శుద్దీకరించెను. ఇదే పరలోక సువార్తా ప్రారంభము. వీటిలో ఏ ఒక్కదానిని మినహాయించినను పరలోక సువార్త సంపూర్ణము కానేరాదు. 
 కాబట్టి ఎవరైననూ తిరిగి జన్మించు అనుభవమును పొందగోరిన యెడల వారు యేసుపొందిన బాప్తిస్మము నందు మరియు రక్తమునందు సంయుక్తముగా విశ్వసించవలయును. ఈ రోజులలో అనేకులు ఈ సత్యమునందు విశ్వసించుట లేదు. యేసుయొక్క బాప్తిస్మము వారు కేవలము ఒక ఆచారముగా భావించుచున్నారు. ఇది చాలా ఘోరమైన తప్పిదము. యేసునందు విశ్వసించిన వారందరూ ఆయన బాప్తిస్మమునందు మరియు రక్తమునందు తప్పక నమ్మికయుంచవలయును.
కేవలము పాపపరిహారార్ధమై క్షమాపణా ప్రార్థన చేసిన యెడల మన పాపములు తొలగిపోవునా? బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు బాప్తిస్మము పొందగానే మన పాపములన్నియు ఆయనపై మోపబడెను. సమస్త మానవాళి పాపములను యేసు స్వీకరించుటకు ఇంతకంటే వేరొక మార్గము లేదు.
 మనము నీరు మరియు ఆత్మ ద్వారా తిరిగి జన్మించి పరలోకరాజ్యములోనికి ప్రవేశింపగలము. ఈ బాప్తిస్మపు నీరు మరియు సిలువనందు చిందించబడిన రక్తము లేకుండా విమోచనే లేదు. యోహాను 3:5లో ప్రభువు నికొదేముతో చెప్పినట్లు దేవుని చూడవలెనన్న ఒకడు తిరిగి జన్మించవలెను. యేసు యొక్క బాప్తిస్మము మరియు రక్తమునందు మాత్రమే నిజమైన విమోచనయున్నది.
 

యేసు పొందిన బాప్తిస్మo లేకుండా ఎవరైననూ రక్షింపబడగలరా?
 
యేసు మన రక్షకుడు ఎటుల కాగలిగెను?
ఆయన పొందిన బాప్తిస్మము ద్వారా మన పాపములను స్వీకరించి మనకు రక్షకుడాయెను.
 
యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము పొందుట ద్వారా ఈ లోకపాపములను తొలగించెను అను సత్యమును ప్రభువు యొక్క బహిరంగ సేవ నుండి తొలగించిన యెడల, లేక యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను పరిగణించనియెడల, కన్య మరియ ద్వారా జన్మించెనన్న విషయము విస్మరించినయెడల లేక యేసుక్రీస్తు యొక్క సిలువనందు విశ్వసించుట నిర్లక్ష్యపరచిన యెడల క్రైస్తవ్యము కేవలము మూఢనమ్మకము గలిగిన మతముగానే ఉండును. అప్పుడు బౌద్ధులు తమ దేవాలయములో ‘‘మమ్మును క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి.’’ అని భజనలు చేయు విధముగా క్రైస్తవ విశ్వాసులు కూడా క్షమాపణా ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవారు.
 యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమును సువార్త నుండి తొలగించిన యెడల మన పాపములు ఆయనపై యెటుల ఆరోపింపగలము. అటులైనచో మన విశ్వాసము వ్యర్ధమైనదే. ఒక బాకీదారు తన అప్పు నిమిత్తమై ఏమియూ చెల్లించకనే నాకు అప్పులేమీ లేవని చెప్పుకొనుట వంటిదే ఇది. అప్పుడు మనము కేవలము అబద్ధీకులము. ఒక బాకీదారు ఏ అప్పు చెల్లించకనే దాని నిమిత్తమై ఏమియూ చేయకుండా వున్న యెడల అతను ఇంకనూ దివాళాకోరుగానే పరిగణించబడును. మరియు అతని మనస్సాక్షిలోని కల్మషము తొలగించబడదు.
యేసు విశ్వాసులను తాను పొందిన బాప్తిస్మపు నీటి ద్వారా శుద్దీకరించి వారిని దేవుని పిల్లలుగా చేసెను. బాప్తీస్మం మిచ్చుయోహాను ద్వారా బాప్తిస్మము పొందిన యేసు లోకపాపమంతయు స్వీకరించి విశ్వాసులను పరిశుద్ధులుగా చేసెను. మనము ఈ సత్యమును గ్రహించి అంగీకరించిన యెడల మన హృదయములు పరిశుభ్రము కాగలవు.
దేవుని కృపను బట్టి ఆయనకు వందనములు. లూకా 2:14 ఈ విధముగా తెలియజేయుచున్నది.‘‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను.’’ఈ నీరు మరియు రక్తమునందు మనము ఉంచిన విశ్వాసము మనలను సంపూర్ణముగా రక్షించి దేవుని పిల్లలుగా మార్చును. యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు రక్తము మనలను రక్షించినది. ఈ రెండింటియందు విశ్వాసముంచిన వారు రక్షింపబడుదురు.
ఆయన చేసిన కార్యములలో దేనిని మనము తొలగించలేము. కొందరైతే రక్తమునందు మాత్రమే విశ్వాసముంచెదరు. వారు అపోస్తలుడైన పౌలు తెలియపరచినట్లు నేను కేవలము సిలువ నందు మాత్రమే అతిశయించుచున్నాను అని చెప్పిన వాక్యమును ఉదాహరించెదరు. అయితే ఆయన సిలువ బోధలో యేసు యొక్క బాప్తిస్మము కూడా దాగియున్నది కదా.
రోమా 6వ అధ్యాయములో పౌలు భక్తుడు నేను క్రీస్తుయేసులోకి కూడా బాప్తిస్మము పొంది ఆయనతో కూడా మరణించియున్నాను అని తెలియజేసిన వాక్యమును విస్మరించారు. మరియు గలతీ 2:20లో ఈ విధముగా తెలియపరచబడెను.‘‘నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు.నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.’’
మరియు గలతీ 3:27-29 కూడా గమనించగలము.‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తు నందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్ధాన ప్రకారము వారసులైయున్నారు.’’
 యేసుక్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట అనగా ఆయన ఈ లోకములో చేసిన సకల కార్యములు బాప్తిస్మము మరియు చిందించిన రక్తము మొదలగు వాటిని విశ్వసించుటే. యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తమునందు విశ్వాసముంచుట అనగా యేసు రెండు వేల సంవత్సరముల క్రితమే మనపాపములు అన్నియు తొలగించెనన్న సత్యమునందు విశ్వసించుటే. మనకు మరియొక విధానములో రక్షణ సిద్ధించదు.
 

యేసు పొందిన బాప్తిస్మము మరిము సిలువరక్తమునందు విశ్వాసము ద్వారా దేవుడు మనలను రక్షించును.
 
క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేయగనే మన పాపములన్నియు తొలగించబడునా?
కాదు. బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మము పొందిన యేసు మన పాపములన్నియు స్వీకరించెనన్న విశ్వాసము వలననే పాపమల నుండి క్షమాపణ లభించును.
 
‘‘ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితోఒప్పుకొనును’’(రోమా 10:10).
 ‘‘క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనియున్నారు’’ (గలతీ 3:27).మన విశ్వాసము మనలను క్రీస్తునందు బాప్తిస్మము పొందుట అనగా యేసుక్రీస్తును ధరించుకొని దేవుని పిల్లలగుటకు నడిపించును. ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి బాప్తిస్మము స్వీకరించినప్పుడు మన పాపములన్నియు మరియు లోకపాపమంతయు ఆయనపై మోపబడెను.
 మన విశ్వాసము ద్వారా మనము క్రీస్తుతో సమైక్యపరచబడగలము. ఆయన చనిపోయినప్పుడు మనము ఆయనలో చనిపోయివున్నాము. ఆయన పునరుర్దానమునందు మనమూ పునరుత్థానము పొందితిమి. ఇప్పుడు ఆయన పొందిన బాప్తిస్మము, సిలువ రక్తము, పునరుత్థానము, ఆరోహణము, రెండవ రాకడ యందు మనము విశ్వసించి పరలోక రాజ్యములోనికి ప్రవేశించి అక్కడ నిరంతరము ఆయనతో జీవించగలము.
యేసుక్రీస్తు రక్తమునందు మాత్రమే విశ్వాసముంచిన యెడల వారి హృదయములలో మిగిలియున్న పాపమును బట్టి వారు ఎంతో బాధింపబడుదురు. ఎందువలన? వారికి యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మములోని అర్ధము మరియు వారి పాపములను ఆయన శుద్దీకరించి వారి హృదయములను పాపరహితము చేసి వారి హృదయమును హిమము కంటే తెల్లగా చేసి నిత్యత్వములోనికి నడిపించెనన్న సత్యము ఎరుగకుండుట వలననే వారు రక్షింపబడనేరరు.
నీ సమస్త పాపముల నుండి విమోచించిన యేసు యొక్క బాప్తిస్మము మరియు రక్తమునందు నీవు విశ్వాసముంచుచున్నావా? మార్పులేని ఈ సత్యమునందు దయచేసి విశ్వసించండి. ఈ సత్యమునందు నమ్మికయుంచని యెడల మీ విశ్వాసము వృధాయగును. యేసు బాప్తిస్మమునందు విశ్వాసముంచక పోయిన యెడల నీ పాపము నుండి విమోచించబడలేవు. అంతేకాక నీవు ప్రతిఫలాపేక్ష లేని దేవుని ప్రేమయందు వశియుంచలేవు.
కేవలము సిలువయందు మాత్రమే విశ్వసించిన వారు. ‘‘యేసే నా రక్షకుడు మరియు నా ప్రభువు ఆయన సిలువపైన నా కొరకై చనిపోయి మృతులలో నుండి తిరిగి లేచి 40 దినములు ఆయన పునరుత్థానమునకు సాక్షిగా నిలచి పరలోకమునకు ఆరోహణుడై ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమునకు కూర్చిండియున్నాడు. ఆయన రెండవ రాకడలో న్యాయాధిపతిగా తిరిగి వచ్చి నాకు తీర్పు తీర్చును. కనుక ప్రభువైన యేసు నన్ను సంపూర్ణముగా మార్చి వేయుటకై ప్రార్థించుచున్నాను. దాని వలన నేను ఆయనను కలుసుకొనగలను. ఓ, నా ప్రియమైన యేసు, నా రక్షకా నీకు స్తోత్రములు.’’ అని తెలిపెదరు.
 వారు పాపముల నిమిత్తమై క్షమాపణ వేడుకొని ఇంకనూ వారి హృదయములలో పాపము నిలచియున్ననూ వారు పాపరహితులుగా ఉండగోరెదరు. “నేను యేసునందు విశ్వాసముంచితిని.అయిననూ నా హృదయములో పాపము నిలచియున్నది.నేను యేసును ప్రేమించుచున్నాను అయిననూ నా హృదయములో పాపము కలిగి జీవించుచున్నాను.కనుక నేను ‘దేవా రండి నా పెండ్లికుమారుడా రమ్ము’ అని చెప్పలేని స్థితిలో వున్నాను. ఇంకనూ నా హృదయములో వున్న పాపమును బట్టి నాకు రక్షణయందు నిశ్చయత లేదు. కనుక నేను సంపూర్ణముగా సిద్ధపడిన తరువాతే యేసు తిరిగి వచ్చునని భావిస్తున్నాను. మరియు నేను ఎంతో ధృడముగా ప్రార్థనచేసి బలముగా పశ్చాత్తాపపడి సిద్ధపడగలను. నేను నా హృదయపూర్వకముగా యేసును ప్రేమించుచున్నాను. కానీ నా హృదయములో ఇంకనూ నిలచియున్న పాపమునుబట్టి నేను ఆయన యెదుట నిలువలేక యున్నాను.’’
 “నీవు ఇంకనూ అసంపూర్ణుడవని,ఎందువలన భావించుచున్నావు’’అని అటువంటి వ్యక్తిని యేసు అడుగును.
వారు ఈ విధముగా సమాధానమిచ్చెదరు.‘‘దేవా, నేను నీతిమంతుడను కానని తెలుసు. నేను అనుదినము పాపము చేయుచునే యున్నాను. కనుక మీరు పాపులను పిలిచినప్పుడు నన్ను కూడా పిలువ వలసినదిగా ప్రార్థిస్తున్నాను.’’
మన సృష్టికర్త మరియు న్యాయాధిపతియైన దేవుడు పాపులను అంగీకరించడనియు మరియు వారిని తన పిల్లలుగా చేసికొనడనియు వీరు గ్రహించలేకున్నారు. 
 పెండ్లికుమారుడు అరుదెంచి పాపసంబంధమైన పెండ్లికుమార్తె యొక్క సమస్యలన్నీ తొలగించెను. పెండ్లికుమార్తెకు ఈ సత్యము తెలియలేదు గనుక ఆమె ఇంకనూ బాధపడుచూ యున్నది. మనము పాపులమనియు మరియు శరీరముతో నివసించుచున్నాము కనుక పాపము చేయుచున్నామనియు భావించిన యెడలను మనకు దేవుని యందు సరియైన విశ్వాసము లేనట్లే. దేవుని వాక్యములోని సత్యమును మనము గ్రహించని యెడల మన హృదయములోని పాపము ప్రతిదినము పెరుగుచునే యుండును.
 
వారి హృదయములలో నిలచిన పాపమును బట్టి ఎందులకు వారు బాధపడుదురు?
వారి పాపములను తొలగించిన యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మమును గురించిన అవగాహన వారికి లేనందు వలన వారు ఈ సత్యమును హృదయములో భద్రపరచుకొనలేరు గనుక.
 
ఈ లోక పాపమంతయు మన పెండ్లికుమారుడు స్వీకరించియున్నాడు. ఎక్కడ? ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు.ఈసత్యమును విశ్వసించని వారు ఇంకనూ పాపులైయున్నారు. వారు పెండ్లికుమార్తెలు కాలేకుండా యున్నారు.
 పెండ్లికుమారుడు పెండ్లికుమార్తెను ఈ విధముగా అడుగును.‘‘నీవు నా పెండ్లికుమార్తెవు కాని యెడల ఏ విధముగా నన్ను ప్రేమించగలవు? నన్ను నీ పెండ్లికుమారునిగా స్వీకరించుటకు ముందుగా నీ సమస్త పాపములు తొలగింపబడవలెను గదా.’’
యేసుక్రీస్తు బాప్తిస్మము లేకుండా మనము విమోచింపబడగలమా? లేదు! మనము దేవుని స్వరూపములో సృజింపబడియున్నాము. మన హృదయములలో న్యాయమును అ అపేక్షించుచున్నాము. మన మనస్సాక్షి నిర్మలముగా వుండుటకు ఆతురపడుదుము. మన హృదయములు శుద్దీకరణ పొందని యెడల మనము పాపరహితులుగా యుండుట అసాధ్యము. యేసుపొందిన బాప్తిస్మము నందు విశ్వాసముంచి అంగీకరించిన యెడల మనము పాపములేని వారమని మరియు నీతిమంతులమని చెప్పగలము.
మన హృదయములో ఇంకనూ పాపము నిలచియున్న యెడల మనము పాపములేని వారమని చెప్పినచో మన మనస్సాక్షి ఎన్నడునూ పరిశుద్ధపరచబడనేరదు. ఈ పరిస్థితిలో దేవుడు మనలను అంగీకరించడు. దేవుడు అబద్ధీకుడు కాడు.
దేవుడు మోషేతో ఇశ్రాయేలీయుల జనాభాను లెక్కించమని చెప్పెను. అటులనే వారి జీవితము నిమిత్తము పరిహారము చెల్లించవలసినదిగా కోరెను. ధనికులు సగము షెకెలు కంటే అధికముగాను మరియు బీదవారు కూడా అంతే ఇయ్యవలెనని తెలిపెను. ప్రతి ఒక్కరు దీనిని చెల్లించవలెను.
కనుక వారి జీవితము నిమిత్తమై వెల చెల్లించిన యేసునందు విశ్వాసముంచక ఎవరునూ శుద్ధీకరణపొందలేరు. అటువంటి వ్యక్తులు వారి హృదయములలో పాపము కలిగి జీవింతురు.
మనము కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తమునందే విశ్వసించిన యెడల మన హృదయములో పాపము కలిగి మనము పాపులమని ఒప్పుకొనవలసిన పరిస్థితి ఏర్పడును. అయితే మనము యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువ గురించిన సువార్తను విశ్వసించిన యెడల మన హృదయములో పాపములేని వారమని చెప్పగలము. అప్పుడే రక్షణ మరియు నిత్యజీవమును మనము అందుకొనగలము.
 

పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా చేయు పాపము
 
ఏవిధమైన పాపము మానవులను నరకమునకు పంపును?
పరిశుద్ధాత్మునికి వ్యతిరేకముగా చేసిన పాపము అనగా యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము నందు విశ్వసించక పోవుటయే.
 
రోమా 1:17 ఈ విధముగా తెలియజేయుచున్నది.‘‘నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.’’ ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి ఆయన పొందిన బాప్తిస్మము మరియు సిలువ మరణము వలన మన పాపములను శుద్ధీకరించెను. యేసుపొందిన బాప్తిస్మము మరియు ఆయన చిందించిన రక్తమే సువార్తలోని శక్తియైయున్నది. యేసు మన పాపములను ఒక్కసారిగా మరియు సంపూర్ణముగా విమోచించెను. 
విశ్వసించుట అనగా రక్షణ అవిశ్వాసమనగా నిత్యమైన నరకము. మన పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి మన పాపపరిహార నిమిత్తము ఆయనకు బాప్తిస్మము ఇప్పించెను. అందువలన ఆయనయందు విశ్వసించినచో మన సమస్త అపరాధముల నుండి విడిపించబడగలము.
ఈ లోకములో యేసుక్రీస్తు బాప్తిస్మము, రక్తమును విశ్వసించకపోవుటయే పరిహరింపబడని మరియు మిగిలియున్న పాపము. అవిశ్వాసము వలన పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాము. దానిని బట్టి దేవుని చేత తీర్పుపొంది నరకములోనికి పడద్రోయబడగలము. సమస్త పాపములలో ఇదే ఘోరమైన పాపము. మీలో ఎవరైనా ఇటువంటి పాపము చేసియున్న యెడల పశ్చాత్తాపము పొంది యేసుక్రీస్తు వారి బాప్తిస్మము నందు విశ్వసించి విమోచింపబడవలయును. అటుల చేయనిచో మనము శాశ్వతముగా నాశనమునకు పోవుదము.
యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మము మరియు సిలువ రక్తమునందున్న విమోచనకు సాక్షులుగా మీరు రక్షింపబడితిరా? యోహాను 1:29లోబాప్తీస్మం మిచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యము అనగా ‘‘ఇదిగో! లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱె పిల్ల.’’ అన్న సాక్ష్యమును నీవు స్వీకరించియున్నావా? యేసుక్రీస్తు వారి బాప్తిస్మము నందు మరియు రక్తమునందు విశ్వసించుచున్నావా? ‘‘వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహారార్ధ బలి యికను ఎన్నడును ఉండదు.’’ అని హెబ్రీ 10:18లో వ్రాయబడినది. 
వారి హృదయములలో యేసుపొందిన బాప్తిస్మము మరియు చిందించిన రక్తమునందు విశ్వాసముంచువారిని దేవుడు అంగీకరించును. మరియు ఆయన పిల్లలుగా చేసికొనును. ఇట్టి విశ్వాసము కలవారు యేసుక్రీస్తు యొక్క నీతియుక్తమైన ప్రేమద్వారా విమోచింపబడుదురు.
దేవుని చేత పంపబడిన వారు దైవవాక్యమును బోధించెదరు. ఈ లోకసంబంధులు మరియు దేవునిచేత పంపబడని వారు తమ స్వంత జ్ఞానేచ్ఛలను బట్టి బోధించెదరు. ఈ భూమిపైన దేవుని వాక్యమును బోధించువారు అనేకులు కలరు. దేవునిచేత పంపబడిన వారు యేసుక్రీస్తు యొక్క బాప్తిస్మము మరియు సిలువ మరణమును బోధింతురు.
అయితే తమ స్వంత మాటను బోధించువారు తమ ఊహను బట్టి బోధించుచున్నారు.‘‘మేము మన మూల పాపమునుండి విమోచింపబడితిమి. అయితే అనుదినము మన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడుచున్నాము’’అని తెలియజేసెదరు. మరియు శుద్దీకరణ అంచెలంచెలుగా లభించునని బోధింతురు.
ఒక వ్యక్తి తనంతట తాను పరిశుద్ధత పొందగలడా? మన స్వంత జ్ఞానమును బట్టి ప్రయత్నమును బట్టి మనము శుద్ధీకరింపబడగలమా? దేవుడు మన పాపములను తొలగించును గనుక మనము పరిశుద్ధపరచబడియున్నామా లేక మన స్వంత క్రియలనుబట్టి మనకు విమోచన లభించినదా?
నిజమైన విశ్వాసమే మనలను శుద్ధీకరించును.పది వేల సార్లు కడిగిననూ బొగ్గు తెల్లగా మారునా? రంగులో అద్ది నల్లచర్మమును తెలుపు చేయగలమా? మన పాపములను సబ్బుతో శుభ్రపరచగలమా? మన నీతిమంతత్వము మురికి గుడ్డవంటిది. మనము యేసురక్తము మరియు బాప్తిస్మము నందు విశ్వాసముంచి నీతిమంతులము కాగలమా? లేక కేవలము సిలువ రక్తము నందు మాత్రమే విశ్వాసముంచగలమా? 
నిజమైన విశ్వాసము యేసు పొందిన బాప్తిస్మములోనూ మరియు సిలువపైన చిందించిన రక్తములో ఉన్నది. రక్షణ మన స్వంత ప్రయత్నములను బట్టి చేకూరదు. యేసుక్రీస్తు వారి బాప్తిస్మము నందు మరియు ఆయన రక్తమునందు ఉంచబడిన విశ్వాసమే పాపములను శుద్ధీకరించి మనలను నీతిమంతులుగా చేయును.
తండ్రి సమస్త ప్రజలను కుమారుని హస్తములో ఉంచెను. ఆయన యందు విశ్వసించు వారు నిత్యజీవము పొందెదరు. కుమారుని యందు విశ్వాసముంచుట అనగా ఆయన పొందిన బాప్తిస్మము మరియు చిందించిన సిలువ రక్తములోనున్న విమోచనను నమ్ముటయే. ఆయన యందు విశ్వసించిన వారు దేవుని బిడ్డవలే నిత్యజీవము కలిగియుందురు. రక్షింపబడిన వారు దేవుని కుడిపార్శ్వమున నిలుతురు.
యేసుక్రీస్తు పొందిన బాప్తిస్మమునందు వున్న విశ్వాసము, దేవునితో సమకూడిన ఐక్యత మరియు పరిశుద్ధాత్మలో నమ్మికయే సరియైన విశ్వాసమైయున్నది. దేవుని వాక్యమువలన మనము తిరిగి జన్మించగలము. మనము యేసు పొందిన బాప్తిస్మము నందు మరియు సిలువ రక్తము నందు విశ్వాసముంచి రక్షింపబడ గలము.
విశ్వాసము కలిగియుండుడి. యేసుపొందిన బాప్తిస్మము నందు మరియు ఆయన రక్తము నందు ఉంచబడు విశ్వాసమే మనకు విమోచనను దయ చేయును. నిజమైన సువార్త యందు విశ్వాసము కలిగియుండి పాపము నుండి క్షమాపణ పొందుకొనవలెను.